తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం (మే 4) నుంచి 9వ తేదీ వరకు ‘రైతు వారం’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి (AO) సీతారాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటలకు మండలంలోని తిరుమలాయపాలెం, గోపాలపురం, దమ్మాయిగూడెం, బీరోల్, రాజారాం, కాకరవాయి, హస్నాబాద్, పాతర్లపాడు క్లస్టర్ల రైతు వేదికల వద్ద ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
ఈ సదస్సుల్లో నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న వరి రకాల సాగుపై నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, అనుబంధ శాఖల అధికారులు భారీగా హాజరై విజయవంతం చేయాలని వ్యవసాయ అధికారి కోరారు. రైతులు తమ వ్యవసాయానికి సంబంధించిన సందేహాలను నేరుగా అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.






