30 June, 2026 | 9:15 PM

Breaking News

సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం

30-06-2026 08:11 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ముందు సింగరేణి అధికారులకు సంబంధించిన PRP (Performance Related Pay) నిలుపుదలను వ్యతిరేకిస్తూ CMOAI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ సంఘీభావం ప్రకటించి, అధికారులకు తన పూర్తి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా డా. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... సింగరేణి అధికారులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కోరారు.

అధికారుల PRP నిలుపుదల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే, ఇటీవల సోమవారం ఈ అంశంపై సింగరేణి డైరెక్టర్లు మరియు సీఎండీతో జరిగిన సమావేశంలో కూడా చర్చించినట్లు వెల్లడించారు. అధికారులకు PRP చెల్లించేందుకు ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా ఇబ్బందులు లేవని, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వారు అభిప్రాయపడినట్లు తెలిపారు. సింగరేణి అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందున, వారికి రావాల్సిన న్యాయమైన ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలని డా. జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.