అర్జీలను వేగంగా పరిష్కరించాలి
డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అబ్రహం లింకన్
వనపర్తి టౌన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అబ్రహం లింకన్ సూచించారు. సోమవారం వనపర్తి ఆర్డిఓ కార్యాలయంలో డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అబ్రహం లింకన్, జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ తో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం, అర్జీల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. నేడు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 10 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






