27 July, 2026 | 8:27 PM

మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్

27-07-2026 07:36 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు ఎస్టీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో మరుగుదొడ్ల చుట్టూ కూలిపోయిన రక్షణ గోడను వెంటనే పునర్నిర్మించాలని కోరుతూ పీడీఎస్‌యూ నాయకులు సోమవారం ఏటీడీఓకు వినతిపత్రం అందజేశారు. మూడు సంవత్సరాలుగా గోడ కూలిపోయి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్ ఆరోపించారు. ప్రధాన రహదారి నుంచి మరుగుదొడ్లు నేరుగా కనిపించడం వల్ల విద్యార్థినుల గోప్యతకు భంగం కలుగుతోందని, పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని హాస్టళ్ల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే గోడను పునర్నిర్మించి విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.