23 June, 2026 | 8:54 PM

రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి

23-06-2026 07:37 PM

- సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్

కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించిన బకాయి చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ డిమాండ్ చేశారు.కోనరావుపేట మండలంలోని ధర్మారం, కొలనూరు, మర్తన్‌పేట గ్రామాల రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల ద్వారా అపరాల్ పార్క్ గోదాముకు తరలించినప్పటికీ, సంబంధిత రైతులకు ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లారీ యజమానులు మరియు గోదాం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు లారీల ధాన్యం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదని ఆరోపించారు. దీంతో సంబంధిత గ్రామాల రైతులకు ధాన్యం డబ్బులు అందకుండా పోయాయని తెలిపారు.

ఆరు నెలల పాటు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించిన రైతులు అధికారుల తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల అండదండలతో నకిలీ ట్రాక్ షిట్ లను సృష్టించి సుమారు రూ.కోటి మేర కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి అక్రమాలు గతంలో కూడా జరిగాయా అనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.గత రెండేళ్ల ధాన్యం కొనుగోలు రికార్డులన్నింటిపై ప్రభుత్వం విచారణ జరిపి, మూడు లారీల రసీదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.