23 June, 2026 | 8:53 PM

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక

23-06-2026 07:43 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులతో పాటు పట్టణంలోని ప్రముఖ బుక్ స్టాల్స్ తో కుమ్మక్కై పాఠ్యపుస్తకాల విక్రయాల్లోనూ అధిక ధరలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఏఐవైఎఫ్ నాయకులు హరీష్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ సూచించిన పుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలను జాబితాలో చేర్చి బుక్‌స్టాల్స్ ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు.

పాఠ్యపుస్తకాల కొనుగోలులో జీఎస్టీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని, ప్రతి పుస్తకానికి సరైన ధర వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎంఈఓ వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే పట్టణంలోని బుక్ స్టాల్స్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.