విద్యార్థులపై శ్రద్ద చూపండి
ఉపాధ్యాయులకు ఎంఈఓ సూచన
మునిపల్లి,(విజయక్రాంతి): వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని ఎంఈఓ భీంసింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంఎల్ఎన్ విద్యార్థులు విద్యా ప్రమాణాలను సాధిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. ముఖ్యంగా తెలుగు భాషలో చదవడం, రాయడం నైపుణ్యాలు, అలాగే గణితంలోని చతుర్విధ ప్రక్రియలు (కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం) నిర్వహించే సామర్థ్యాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన ప్రగతి, తరగతి గదిలో జరుగుతున్న బోధనాభ్యాసన కార్యక్రమాలను చూసి సంతృప్తిని వ్యక్తంచేశారు. అంతకు ముందు విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఉచితంగా అందజేస్తున్న హ్యాండ్రైటింగ్ పుస్తకాలను పంపిణీ చేశారు. బోధనాభ్యాసన ప్రక్రియలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను సమర్థవంతంగా వినియోగించాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ భీంసింగ్ ఆదేశించారు.






