పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.అనిల్ కుమార్
ముషీరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): పిల్లల ప్రవర్తను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. ఇటీవల విద్యార్థుల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపారెడ్డి కి ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పిల్లల ప్రవర్తన, స్నేహితుల పరిచయాలు, బయటకు వెళ్లే సమయం, అనుమానాస్పదంగా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి, మత్తు పదార్థాల నివారణకు ప్రతి మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ట్రస్మా డిమాండ్ చేసింది.






