20 July, 2026 | 4:11 AM

సాయినాథపురంలో ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన

19-07-2026 05:13 PM

ఉచిత వైద్య సేవలు అందించిన నిపుణులు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు

ఉప్పల్, విజయక్రాంతి జూలై 19: కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్ సాయినాథపురం ఆఫీసర్స్ కాలనీ పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రమేష్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పొందారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. రాజేశ్వరి (జనరల్ మెడిసిన్), డాక్టర్ పి. రమేష్ (కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్) రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.

ప్రజలకు మరింత అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు సీబీపీ, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, సీరం క్రియేటినిన్, ఆర్‌బీఎస్ వంటి ల్యాబ్ పరీక్షలపై 75 శాతం రాయితీ కల్పించారు. అలాగే ఎన్‌సీఎస్, ఈఈజీ, పీఎఫ్‌టీ పరీక్షలపై 50 శాతం తగ్గింపు, సీటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ స్పైన్ స్కానింగ్‌లపై 25 శాతం రాయితీ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానికులు కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలు తరచూ నిర్వహించాలని కోరారు. శిబిరం విజయవంతంగా నిర్వహించబడటంతో ప్రజలు నిర్వాహకులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.