07-02-2026 03:12:42 PM
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు 28-02-2026 తో ముగియనున్నందున, అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్, హైదరాబాద్ వారికి పంపించాలని సూచించారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి సమర్పించాలన్నారు.
యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార ,పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిల జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డు కోసం ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీ 09-02-2026 నుంచి ప్రారంభం అవుతుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.