ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని, సేంద్రీయ విధానాన్ని అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు హరిత ఎరువు (జీలుగ) విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం బయ్యారం మండలంలోని బాలాజీపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని రైతులకు పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలు, నకిలీ విత్తనాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల వైవిధ్యీకరణ, యూరియా వినియోగాన్ని తగ్గించడం, నానో యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పచ్చి రొట్ట పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం రైతులకుజీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.






