అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని 22, 24వ వార్డుల్లో బీఎల్ఏలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ ఫారాల నమోదు, ఓటర్ల వివరాల సేకరణను పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సూచించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తమ వార్డులో ఓటర్ల నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, అర్హులందరికీ ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.






