రైతులకు అధికారులు సహకరించాలి
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పంటలను విక్రయించేందుకు మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపడుతూ వారికి న్యాయం జరి గేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి, మార్కెట్ కు పంటను తీసుకొచ్చిన తొలి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. తేమ శాతం సాకుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, మద్దత్తు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఉమేష్తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






