పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు దింపిన అధికారులు
రైతుల సమస్యపై మాజీ ఎమ్మెల్యే మెచ్చా స్పందన
అశ్వారావుపేట, ఆగస్టు 7 ( విజయ క్రాంతి) : అశ్వారావుపేట మండలంలోని గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు ఏళ్ళు గడిచినప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు నీరు రైతులకు ఉపయోగపడకుండానే వృథాగా పోతున్నాయి. ఈ సమస్యను ప్రాజెక్ట్ కింద రైతులు *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మెచ్చా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రాజెక్టు గేట్లను దింపి నీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.
మెచ్చా నాగేశ్వరరావు సూచనపై స్పందించిన అధికారులు గేట్లను దింపడంతో ప్రాజెక్టు నీటిని సాగుకు వినియోగించుకునే అవకాశం రైతులకు లభించింది. దీంతో తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మెచ్చాకి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించడంపై హర్షం వ్యక్తం చేశారు.






