16 July, 2026 | 1:26 AM

పేదలకు వరం సీఎం సహాయనిధి

16-07-2026 01:15 AM

లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన నీలం మధు

పటాన్ చెరు, జూలై 15: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు ఈ నిధి ఎంతో భరోసానిస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.

బుధవారం ఆయన అమీన్ పూర్ డివిజన్ అనసుజకు రూ.60,000, గుమ్మడిదల సీహెచ్ శ్రీనివాస్ కు రూ.47,500, ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ సంగన్నగారి మహేష్ కు రూ.60,000 చొప్పున లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎన్‌ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని కొనియాడారు. సమయానికి వైద్యం అందక, అప్పుల పాలవుతున్న ఎన్నో కుటుంబాలను ప్రభుత్వం ఈ నిధి ద్వారా ఆదుకుంటోందని, నిరుపేదలు అనారోగ్యం బారిన పడినప్పుడు అధైర్యపడకుండా ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.