10-02-2026 01:29:22 AM
7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్.సి. సంతోష్
గజ్వేల్,ఫిబ్రవరి 9 : ఏడవ వార్డులోని ఎర్రవల్లి సింగారం గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 7వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నేతి చిన్న సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు (ఎర్రవల్లి, సింగారం) ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఓటర్లను అభ్యర్థించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజలు కేసీఆర్ హయాంలో అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారన్నారు. కెసిఆర్ పాలనే బాగుందని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కేటాయించిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసిందని, ఇది గజ్వేల్ అభివృద్ధికి గొడ్డలి పెట్టని సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనించారని, ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు స్వచ్ఛందంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. వార్డులో ఏ సమస్య వచ్చినా నా సొంత సమస్యగా భావించి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను అని సంతోష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.