రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు
30-06-2026 09:05 PM
గుండాల,(విజయక్రాంతి): మండలంలో మొబైల్ సిగ్నల్ సమస్యల కారణంగా రైతులు యూరియాను పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు మంగళవారం పత్రిక ప్రకటనలో వాపోయారు. యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న మొబైల్ యాప్ గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయక రైతులు అనేక తంటాలు పడుతున్నారని ప్రభుత్వంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొబైల్ యాప్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు ఆధారంగా యూరియా కట్టాలు అందించే విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నామని ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు.






