8 March, 2026 | 5:23 AM

చెట్ల నీడలో చదివి ఎమ్మెల్సీ స్థాయికి

06-03-2026 07:19 PM

- ప్రభుత్వ పాఠశాలలే చైతన్యానికి కేంద్రాలు

- విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి 

- పలివెల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,(విజయక్రాంతి): చెట్ల నీడలో చదివి ఎమ్మెల్సీ స్థాయికి చేరి తాను చదువుకున్న పాఠశాలలో తిరిగి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మండలంలోని పలివెల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమానికి హాజరై పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయిని నియమించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీకి పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు ఆయనను సన్మానించిన అనంతరం మాట్లాడారు.

పలివెల పాఠశాలలో చదవకపోయి ఉంటే తాను ఈ స్థాయికి చేరుకోలేకపోయేవాడినని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు.తాను చదువుకునే రోజుల్లో స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా డివోగా బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు. విద్యార్థులకు అలాంటి సమస్యలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయిని నియమించేందుకు కృషి చేశానన్నారు.

మేము చెట్ల నీడలో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నామని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు చైతన్యవంతులవుతారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం విద్య, వైద్యం ప్రైవేటీకరణతో వ్యాపార రంగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలివెల పాఠశాల అభివృద్ధికి తన సొంత నిధుల నుంచి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.