హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు కీలకం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న ప్రయాణికులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి విద్యార్థులతో కలసి పువ్వులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం అనేది కేవలం చట్టాన్ని పాటించడం కోసం మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రత కోసం ఎంతో అవసరమని అన్నారు.
ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. వాహనం నడిపే సమయంలో వేగ నియంత్రణ పాటించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకపోవడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు భద్రత చర్యలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ మధుకర్, పాఠశాల విద్యార్థులు ,ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






