ఖరీఫ్ సీజన్కు విత్తనాలు సిద్ధంగా ఉంచాం: మంత్రి తుమ్మల
ఖరీఫ్ సీజన్ కు విత్తనాలు సిద్ధం
నష్టం వచ్చినా సరే... మొక్కజొన్న కొన్నం
ఖమ్మం: ఖరీఫ్ సీజన్కు విత్తనాలు సిద్ధంగా ఉంచామని బుధవారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేసే విత్తనాలు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో జొన్న, మొక్కజొన్న పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయట్లేదని వెల్లడించారు. నష్టం వచ్చినా సరే.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు చేశామని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగిందని వివరించారు.
డీజిల్ కొరత, హమాలీల కొరత వల్ల ధాన్యం సేకరణ ఆలస్యమైందని ఆరోపించారు. రైతులు పంటల వైవిధ్యం, పంటమార్పిడిపై దృష్టి పెట్టాలని కోరారు. కూరగాయాలు, పప్పు దినుసుల పంటల సాగు చాలా పెరగాలన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, సీఎన్ జీ కొరత వల్ల సమస్యలు పెరిగాయని తెలిపారు. విదేశాల నుంచి పత్తి దిగుమతికి కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించాలని కోరారు.
కేంద్ర విధానాల వల్ల మన దేశ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికంగా రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతోందన్నారు. రసాయన ఎరువులు ఎక్కువ వాడితే పంట ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు కనిపిస్తే.. ఇతర దేశాలు కొనట్లేదని వెల్లడించారు. పంటల ఎగుమతులు, దిగుమతులు రాష్ట్రాల చేతిలో ఉండదని స్పష్టం చేశారు.






