సీఎం పర్యటనతో జిల్లాకు ప్రయోజనం లేదు
ప్రజలను మభ్యపెట్టే ప్రసంగం
బిజెపి నాయకుల ఆరోపణ
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) జిల్లాలో నిర్వహించిన పర్యటన పూర్తిగా అబద్ధపు హామీలు, ప్రజలను మభ్యపెట్టే ప్రసంగాలతోనే ముగిసిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్ యాదవ్, కోవ విజయ్ కుమార్ విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ఆదివాసి పీవీటీజీ కుటుంబాల కోసం అమలు చేస్తున్న PM-JANMAN పథకం కింద నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం “ఇందిరమ్మ ఇళ్లు”గా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. “సొమ్ము ఒకనిది... సోకు ఒకనిది” అన్నట్లుగా కేంద్ర నిధులతో చేపట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, PM-KISAN, ఆయుష్మాన్ భారత్, ఉపాధి హామీ, ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు అందిస్తోందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిపై సొంత రంగులు పూసి ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఆదివాసీ గ్రామాల సమస్యలు, గుండి బ్రిడ్జి, ఆనార్పల్లి బ్రిడ్జి వంటి కీలక అంశాలపై సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కొమురం భీం, వట్టివాగు, అమ్మనమడుగు ప్రాజెక్టుల పరిస్థితిని ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొమురం భీం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మాణిక్గూడ కాలువ పనులు పూర్తి కాక సాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం వంటి కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, పాత సమస్యలను పరిష్కరించకుండా కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు.






