మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిట్యాల పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం అయినా కడారి లింగయ్య యాదవ్ మనవడు జాల శివచరణ్, మనవరాలు సాయిరాణి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. శనివారం ఈ విషయాన్ని చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
విద్యాభ్యాసం కొనసాగించేందుకు సాయిరాణికి ప్రైవేట్ కళాశాలలో సీటు ఇప్పించడంతో పాటు, కుటుంబ సభ్యులకు రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానని, అనాథలుగా మారిన పిల్లల భవిష్యత్తు కోసం తన తరఫున అవసరమైన సహాయం అందిస్తానని అన్నారు. మంత్రి చూపిన ఉదారత, మానవత్వానికి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.






