బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?
- బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా
- తెలివి మీ ఒక్కరి సోత్తే కాదు... అవతలి వారకి ఉంటది
- అన్నీ మామ, అల్లుడికే తెలుసని అనుకుంటే ఎలా?
- ఏపీతో నీటి విభజన ఒప్పందంపై మామా, అల్లుడు సంతకాలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. రాజకీయంగా నష్టం జరుగుతోందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ యూపీఏ అన్నారు. గొల్లపల్లి ప్రాజెక్టును కాసుల కోసమే కడుతున్నారని తమనే విమర్శిస్తున్నారని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అని ప్రశ్నించారు. గొల్లపల్లి ప్రాజెక్టును కట్టాలని సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు అడిగామని గుర్తుచేశారు.
25 టీఎంసీలతో గొల్లపల్లిని నిర్మిస్తామని 2016లో జీవో ఇచ్చారు. 20 రిజర్వాయర్లు నిర్మించాలని 2019 మార్చిలో వాళ్లే ప్రతిపాదించారని పేర్కొన్నారు. రోజుకు సుమారు 10 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే శ్రీశైలంలో నీళ్లు ఉంటాయా? రాయలసీమ, ముచ్చుమర్రి, గాలేరు- నగరి పేరుతో లిఫ్ట్ చేస్తే పరిస్థితి ఏమిటి? అని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు లిఫ్ట్ ద్వారా 12 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని మీరే చెప్పారని పేర్కొన్నారు.
విద్యుదుత్పత్తి పేరుతో ఏపీ పంపులు ఆన్ చేసి నీరు కిందకు వదిలిందని చెప్పారు. ధర్నా చేస్తామని హెచ్చరిస్తే అప్పుడు వెనక్కి తగ్గారని సూచించారు. 'అన్నీ మామ, అల్లుడికే తెలుసని అనుకుంటే ఎలా .. తెలివి మీ ఒక్కరి సొత్తే కాదు.. అవతలి వారికీ ఉంటుంది' అన్నారు. ఏపీతో నీటి విభజన ఒప్పందంపై మామా, అల్లుడు సంతకాలు చేశారని జూపల్లి ఆరోపించారు. మీకు ధనిక రాష్ట్రం అప్పగిస్తే.. రూ. 8లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని ధ్వజమెత్తారు. అనేక ప్రాజెక్టుల్లో భూసేకరణ పరిహారం కూడా మీరు ఇవ్వలేదన్నారు. నీళ్లు ఉన్న చోట లిఫ్ట్ ద్వారా నీళ్లు పట్టుకుపోతున్నారని చెప్పారు. పదేళ్లలో నీళ్లు లేనిచోట మాత్రం అనేక ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఆలోచన, అవగాహన లేక తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు.




