రైతులు ఆందోళన చెందొద్దు— అండగా ఉంటాం!
కేంద్ర ప్రభుత్వం వల్లే కొనుగోలు ఆలస్యం
తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి,మే6(విజయక్రాంతి): రైతులు ఎవరు ఆందోళన చెందవద్దనీ, అండగా ఉంటామనీ తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman) అన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం జరిగిందని రాష్ట్రమంత్రి అన్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చిందనీ,ఆన్లైన్ లో ట్రక్ షీట్ తో పాటు ధాన్యం తరలిస్తున్న వాహనాలకు జీపిఆర్ఎస్ వంటి సాంకేతిక సమస్యలతో కొనుగోలు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిబంధనలను సడలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడంతో కొనుగోలు ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు.
వారం పది రోజుల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యంతో పాటు మక్కజొన్న కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన పడవద్దు ధర్నాలు రాస్తారోకోలకు దిగవద్దని రైతులు పండించిన పంటను చివరి గింజ కొనుగోలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి సందర్భంగా సూచించారు. రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని మంత్రి సూచించారు. రైతులకు ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజు, సౌళ్ల నరేష్, చీపురుశెట్టి రాజేష్ తదితరులు ఉన్నారు.






