అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చింతలపాలెం, మే 22 : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలం లోని దొండపాడు గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామంకు చెందిన వడ్డేపల్లి వీరబాబు (25)అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా దొండపాడులో వరుసకు మేనత్త అయిన ఈశ్వరమ్మతో సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గురువారం అతనికి ఆరోగ్యం బాగాలేదని స్థానిక ఆర్ఎంపి వద్దకు తీసుకవెళ్ళి ప్రథమ చికిత్స చేయించినట్లు తెలిపారు.
తదుపరి మెరుగైన చికిత్స కోసం కోదాడ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. అయితే వీరబాబు మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ చింతలపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు చింతలపాలెం ఎస్ఐ పరమేష్ తెలిపారు. అలాగే మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన తదుపరి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.






