8 July, 2026 | 2:42 AM

కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి

08-07-2026 12:00 AM

అయిజ, జూలై 8: అయిజ మండలంలోని వెంకటాపూర్ స్టేజి సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని మనవడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం.. పర్థిపురం గ్రామానికి చెందిన కిష్టన్న తన మనవడితో కలిసి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెంకటాపురం నుంచి పర్థిపురం గ్రామానికి వెళ్తుండగా, కర్నూలు నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా కిష్టన్నకు, అతని మనవడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కిష్టన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మనవడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం.

వేగానికి కేరాఫ్గా కర్ణాటక బస్సులు ఈ మార్గంలో నడిచే కర్ణాటక ఆర్టీసీ బస్సులు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే రూట్లో కర్ణాటక బస్సులు ఢీకొని మనుషులు, మూగజీవులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు బస్సుల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు.