రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లింది
- బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురి కావొద్దు
- మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మద్నూర్, మే 29 (విజయక్రాంతి): రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లినట్లేనని రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జుక్కల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చ లేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చెప్పుతూ కాలం వెళ్ళదీస్తున్నారని ప్రజలకు, రైతులకు ఓరగా పెట్టిందేం లేదన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హను మంతు షిండే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఏమి అభివృద్ధి చేయలేదన్నారు.
మూడు సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్క పనిని కూడా చేపట్టలేదు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ హయంలో ఉమ్మడి జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కేవలం శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు అవుతుందన్నారు. నిజాంబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






