19-02-2026 01:58:31 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని, తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించవలసిన వ్యవస్థను.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మంత్రి మండిపడ్డారు.
మంత్రి పొంగులేటి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం ఉన్నతస్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చారని, అలాగే మానవ ప్రమేయంతో తప్పులు చేసే విధంగా పోర్టల్ను రూపొందించారని తెలిపారు. తక్షణమే ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావలసిన స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కొల్లగొట్టిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్లో ఎలాంటి పొరపాట్లూ జరగకుండా అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూభారతి పోర్టల్ను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్కుమార్, సీఎంఆర్వో మకరంద్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్గాంధీ హనుమంత్ పాల్గొన్నారు.