విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?
స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
AIYF సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను డిమాండ్.
నేరేడుచర్ల, జూలై 14(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి, యువజన నాయకులపై ముందస్తు అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని AIYF సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, మండల అధ్యక్షులు పరికె భరత్, పట్టణ అధ్యక్షులు వడ్డాల భాస్కర్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు,లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా, సమస్యపై ప్రశ్నించిన వారినే లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఆ హక్కును అణచివేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.అక్రమంగా అరెస్టు చేసిన AIYF నాయకులను వెంటనే విడుదల చేసి, నమోదైన కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో AISF, AIYF నాయకులు పాల్గొన్నారు






