తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయడంలో ప్రవేశాలకు పరిమిత సమయం ఉండటం, అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొంటూ, ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, ప్రవేశాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాలను నిలిపివేశారంటూ ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో, విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళనల పెరుగుతుంది. చాలా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తరహాలో, ప్రత్యేక ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, 11, 12 తరగతులను పాఠశాల విద్యా వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ విద్యా కమిషన్ గతంలో సిఫార్సు చేసింది. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా విద్యార్థుల మధ్యలో చదువు మానేసే (dropout) రేటును గణనీయంగా తగ్గించవచ్చని కమిషన్ పేర్కొంది.
ప్రస్తుతం, తెలంగాణ ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని అనుసరిస్తోంది. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో అత్యధికులు, ఇంటర్మీడియట్ విద్య కోసం ప్రత్యేక జూనియర్ కళాశాలల్లో చేరలేకపోవడం వల్ల, పాఠశాల విద్య పూర్తయ్యాక తమ చదువును కొనసాగించడం లేదని అధికారులు వెల్లడించారు. ఇంటర్ విద్యను 11వ,12వ తరగతుల విధానంలో పునర్వ్యవస్థీకరించే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సూచించారు. తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో కూడా ఇదే సిఫార్సు ప్రముఖంగా ప్రస్తావించబడింది. సీనియర్ అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఈ పరివర్తన ప్రక్రియకు సంబంధించిన పలు సాంకేతిక, పరిపాలనాపరమైన అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నందున, విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.






