పటేల్కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న పటేల్కుంట చెరువుకు త్వరలోనే సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఆయన చెరువును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బస్తీవాసులు, పార్టీ నాయకులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే, చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. హెచ్ఎంటీ నగర్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు జరుగుతున్న తరహాలోనే పటేల్కుంట చెరువును కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
చెరువులోని గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తవడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు మెరుగుపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే చెరువు సుందరీకరణకు సంబంధించిన కార్యాచరణ రూపొందించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పటేల్కుంట చెరువుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.






