ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రద్దు
- సంస్కరణలో భాగంగా ఉత్తర్వులు జారీ
- కీలక సంస్కరణలకే ప్రాధాన్యం
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్ను బోర్డు తాత్కాలికంగా రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వులు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది విద్యా వ్యవస్థలో కొన్ని కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా విధానాన్ని అందించడంతో పాటు, అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు పలు సంస్కరణలు చేపడుతున్నట్లు అందులో అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షెడ్యూల్ను రద్దు చేస్తున్నామని, త్వరలోనే సవరించిన షెడ్యూల్ను విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.






