గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం
ఆదివాసులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకి తన వంతు కృషి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని పిట్ట బొంగరం గ్రామపంచాయతీ కేంద్రంలో 66 లక్షల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, వివిధ శాఖల అధికారులుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత మంజూరులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఆదిమత్యంగా గిరిజనులకు ప్రత్యేకంగా మంజూరు చేసిన ఇండ్ల మాదిరిగానే ఆదివాసులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలందరము విన్నవించామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆదివాసులకు ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేయుటకు నిర్ణయించారని గుర్తు చేశారు. మొదటి విడతగా పిట్ట బొంగరం గ్రామపంచాయతీకి మంజూరు చేసిన 31 ఇండ్లలో ఏడాదిలో కేవలం రెండు ఇండ్లను పూర్తి చేయడం సమంజసం కాదన్నారు. పూర్తయిన రెండు ఇండ్లలో సిడం మారుతికి చెందిన ఇంటి నిర్మాణం పూర్తిగా నాసిరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసే ఇంద్ర మైండ్లు మంజూరుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.
ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు 22 కోట్లతో నిర్మించే రెండు వరుసల రహదారి పనులకు ఆర్థిక శాఖ అనుమతితో పాటు టెండర్లు పూర్తయ్యాయని వర్షాకాలం పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. కేస్లాపూర్ జాతరకు వచ్చే రహదారుల పనులు సైతం జాతర ప్రారంభంలోగా పూర్తి చేయిస్తానని అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలకు 36 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేశ్లాపూర్ నుండి పిట్ట బొంగరం మీదుగా సిరికొండ వరకు రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు విద్యావంతులయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ.. జిల్లాలో ఆరు సూత్రాల ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. ఒక్కొక్క అంశంపై ప్రజలకు వివరించారు.
ముఖ్యంగా ప్రతి రైతు పంట కుంటలను నిర్మించుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు నాణ్యత మైన విద్యను అందించడంతోపాటు విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు, ముఖ్యంగా గర్భిణీలకు వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని అన్నారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న సిఆర్టి పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖలు పంపించామని అన్నారు.
విద్య, వైద్యం తో పాటు అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందే విధంగా సప్తగిరి కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి రవీందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కుడిమేత మనోహర్, గ్రామ సర్పంచ్ మడవి ఇంద్రదేవ్, మాజీ ఐటీడీఏ చైర్మన్ సిడం భీమ్ రావు, ఎంపీడీవో మహేందర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఐటిడి ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ తానాజీ జాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






