వడదెబ్బ రోగులకు తక్షణ వైద్య సేవలు
- ప్రత్యేకించి బెడ్లు ఏర్పాటు.
- జనరల్ ఆస్పత్రి సూపర్ ఇంటెండెంట్ డా.ఉషారాణి
నాగర్కర్నూల్,(విజయక్రాంతి): వేసవి ఎండలు తీవ్రత దృష్ట్యా నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) రోగులకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.టి.ఉషారాణి తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి, తాగునీరు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులు, కూలీలు పని ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆక్సిజన్ సౌకర్యంతో పాటు అత్యవసర చికిత్స అందించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక వైద్య బృందం 24 గంటల పాటు సేవలు అందిస్తుందని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని, ఎండల సమయంలో ప్రజలు తగినంత నీరు తాగడం, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, చిన్నపిల్లలు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






