భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా
పశువుల వ్యాపారుల వద్ద భారీగా ముడుపులు
కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా విలేకరుల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ దందాలకు పలువురు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయాల్సిన వాహనాలు ఇతర మార్గాలను విలేకరులే తనిఖీ చేసే పరిస్థితి ఏర్పడింది. వాహనాలు తనిఖీ చేసి భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటున్న వైనం గత కొంతకాలంగా నిరాటంకంగా సాగుతున్నది. దీనితో గుర్తింపు పొందిన విలేకరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గత బుధవారం విలేకరుల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం రోడ్డుపై వెళ్తున్న ట్రాలీ వాహనాలను వెంబడించి ఆపి మీడియా ప్రతినిధులు అని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వారికి భయపడి గతంలో కొంత లావాదేవీలు చేశామని, వ్యవసాయ నిమిత్తం ఎద్దులను తరలించిన కూడా ఆపి వీడియోలు తీస్తూ, మీడియాకు ఎక్కిస్తామంటూ చెప్పి తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదేవిధంగా బుధవారం సాయంత్రం కూడా వెంబడించి వాహనాలను ఆపి భయభ్రాంతులకు గురి చేశారంటూ కోదాడకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇద్దరు విలేకరుల పై బలవంతపు వసూళ్లు సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సతీష్ తెలిపారు.






