07-02-2026 01:57:08 AM
11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జలగరి మల్లేష్
జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆదరిస్తే వార్డు ప్రజల గుండె చప్పుడునవుతానని బీఆర్ఎస్ 11వ వార్డు అభ్యర్థి జలగరి మల్లేష్ అన్నారు. మాదారం, దువ్వగుంట 11వ వార్డులో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో 10 ఏళ్లలో వార్డులో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో అనేక రకాల హామీలు ఇచ్చి నేడు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలొ గుణపాఠం చెప్పాలని కోరారు.
గతంలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్న తనకు కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు భాస్కర్ యాదవ్, శ్రీను ముదిరాజ్, రమేష్, దశరథ్,నరసింహ, రాజు, కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.