3 కోట్ల హైడ్రోఫోనిక్ డ్రగ్స్ పట్టివేత
- చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లలో తీస్తుండగా
- శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
- బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరి అరెస్టు
శంషాబాద్, మే 20 (విజయక్రాంతి): శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అత్యంత ఖరీదైన, విదేశీ రకానికి చెందిన హైడ్రోఫోనిక్ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల కదలికలపై డీఆర్ఐ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఎవరూ అనుమానించని విధంగా ఆలూ చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార పదార్థాల డబ్బాల్లో అత్యంత రహస్యంగా దాచి ఉంచిన 24 ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ఆ ప్యాకెట్లను విప్పి చూడగా ల్యాబ్లో ప్రత్యేక సాంకేతికతతో పెంచే 8.705 కిలోల, రూ.3.05 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి బయటపడింది.
సాధారణ గంజాయితో పోలిస్తే ఈ హైడ్రోఫోనిక్ గంజాయి మట్టి లేకుండా కేవలం నీరు, పోషకాలతో పండించేది. వీర్యవంతమైన గుణాలు ఎక్కువగా ఉండటంతో దీనికి మెట్రో నగరాల్లో డిమాండ్ భారీగా పెరిగింది. పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, ఈ అంతర్జాతీయ నెట్వర్క్లో హైదరాబాద్కు చెందిన స్థానిక డ్రగ్ పెడ్లర్ల పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు.






