ఎదురెదురుగా ద్విచక్ర వాహనాల ఢీ
పాపన్నపేట పంచాయతీ సిబ్బంది దుర్మరణం
పాపన్నపేట, ఆగస్టు10 (విజయ క్రాంతి) : ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో పాపన్నపేట పంచాయతీ సిబ్బంది దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) పాపన్నపేట పంచాయతీ కార్యాలయంలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనం పై బంధువైన వెంకట్ తో కలిసి కొత్తపల్లి వైపు నుంచి పాపన్నపేట వైపు వెళుతున్నాడు. ఇదే క్రమంలో ముస్లాపూర్ గ్రామానికి చెందిన కటికె వారు ఇరువురు ద్విచక్రవాహనం పై ముస్లాపూర్ నుండి మెదక్ వైపు వెళుతున్నారు. యూసుఫ్ పేట గ్రామ శివారులోకి రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీ కొనడంతో రోడ్డుపై పడ్డారు. కృష్ణ తలకు తీవ్ర గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావం అయింది.
ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 108, పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షత్తగాత్రులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కృష్ణ మృతి చెందినట్లు పరీక్షించిన డాక్టర్లు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో పాపన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.






