24 March, 2026 | 8:49 PM

వడగళ్ల వానతో తీవ్రంగా నష్టం

24-03-2026 06:56 PM

నష్టపోయిన రైతులు

ఆందోళన చెందుతున్న రైతులు 

కామారెడ్డి/భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతోపాటు వడగళ్ల వాన కురియడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి కాయలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో దిగుబడి వస్తుందని భావించిన మామిడి రైతులకు పూత, ఖాతా, వడగళ్ల వర్షానికి రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, రాజంపేట, బిబిపేట, రామారెడ్డి, గాంధారి, సదాశివ నగర్, తాడువాయి, లింగంపేట్, మండలాల్లో అకాల వర్షం కురవడంతో రైతులు ఆగమయ్యారు.

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత మధ్య ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వడగళ్లతో కూడిన వర్షం పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వర్షం కారణంగా మామిడి, కూరగాయలతో పాటు వరి పంటకూ నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. వడగళ్ల ప్రభావంతో చెట్లపై ఉన్న కాయలు రాలిపోవడంతో పాటు పొలాల్లో ఉన్న వరి పంట నేలకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఊహించని వర్షం ఒకేసారి ఈదురుగాలితో కూడిన భారీ వడగళ్ల వర్షం కురియడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాళ్ల వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఈదురుగాళ్లకు చింత చెట్లు నుంచి చింతకాయ రాలిపోయింది. చింతపండు చేతికి వచ్చే సమయంలో ఈదురుగాలుల వర్షం వల్ల నేలరాలడంతో తీరంగ చింత రైతులు నష్టపోయారు. అకాల వర్షం రావడంతో రైతులు అప్రమత్తం కాకముందే ఈదురుగాలితో కూడిన వడగల వర్షం కుర వడంతో తీవ్రంగా నష్టపోయినట్టు రైతులు తెలిపారు.