జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): క్షయ వ్యాధికి మందులు ఉన్నాయని, ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే క్షయ వ్యాధి పూర్తిగా నయమైపోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక టి.బి. నివారణ కేంద్రంలో కలెక్టర్ వంద రోజుల క్యాంపెయిన్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వంద రోజుల కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామ గ్రామాలకు తిరుగుతూ టి.బి. లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఉచితంగా మొబైల్ ఎక్సరే, తేమడ పరీక్షలు నిర్వహించి టి.బి. ఉన్న రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది.
క్షయ వ్యాధి రోగులను గుర్తించే కార్యక్రమం ఇప్పటికే జిల్లాలో నిర్వహించి క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు ఉచితంగా మందులు పౌష్టికాహారం వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగ కలెక్టర్ చేతుల మీదుగా క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ కోట్లలో గోధుమ పిండి, మంచి నూనె, బెల్లం, వేరుశనగ, పప్పు దినుసులు వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... టిబి అనేది ఒక అంటూ వ్యాధి అని దీనిని ఆదిలోనే గుర్తించి ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇచ్చే మందులను (6) నెలలపాటు క్రమం తప్పకుండా వాడితే జీవితంలో మరెప్పుడూ టీబి రాకుండా నయం అయిపోతుందన్నారు. ఒక నెల, రెండు నెలలు వాడి ఇక నయం అయిపోతుందని మందులు వేసుకోవడం మానేస్తే కొద్ది రోజులకే తిరిగి వ్యాధి వస్తుందని చెప్పారు. అందుకే వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండి ఆరు నెలలు మందులు వాడి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు అని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి స్థానిక తహసిల్దార్ రమేష్ రెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




