20 April, 2026 | 5:31 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వండి

20-04-2026 12:00 AM

35 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న

మండలంలో ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను తెలియజేస్తున్నా..

మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసిన గుర్రం అంజిరెడ్డి..

సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 19: 35 సంవత్సరాలుగా సిద్దిపేట రూరల్ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి అన్నారు.

ఆదివారం సిద్దిపేటలో పర్యటించిన జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆయన తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ కేటాయించాలని కోరుతూ మండల నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని, కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేసిన తాను, మదన్ మోహన్ కాలం నుండి నంది ఎల్లయ్య, స్వామిచరణ్, సర్వే సత్యనారాయణ, వంగ హనుమంత రెడ్డి, తాండూరి శ్రీనివాస్ గౌడ్, పూజల హరికృష్ణ వరకు ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశానని అన్నారు.

యూత్ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మండల స్థాయి నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు, గ్రామస్థాయిలో మచాపూర్ సర్పంచ్గా సేవలందించడంతో పాటు చింతమడక ఎంపీటీసీగా, జడ్పీటీసీగా కూడా పోటీ చేసి ప్రజా సేవకు అంకితమయ్యానని చెప్పారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ విడిచిపెట్టకుండా కాంగ్రెస్ జెండాను ఎగరవేశానని స్పష్టం చేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రైతు బిడ్డనని, రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అంజిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ పదవి ద్వారా రైతులకు మరింత సేవ చేయగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి చేసిన సేవలు, అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.