లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- ప్రమాదంలో ఒకరి మృతి
వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని లింగాపూర్ స్టేజ్ వద్ద జాతీయ రహదారి-163 పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామానికి చెందిన తుర్పాటి పెద్దులు (55) ద్విచక్ర వాహనంపై చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం సుమారు 5:30 గంటలకు మచ్చాపూర్ వైపు వెళ్తుండగా, ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పెద్దులు లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చల్లా రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చల్లా రాజు తెలిపారు.






