07-02-2026 08:17:20 PM
బడంగ్పేట్,(విజయక్రాంతి): నగరంలోని వరద ముంపు సమస్యలకు ప్రధాన కారణమవుతున్న నాలాల ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) తన నిఘాను పెంచింది. తాజాగా, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రీన్ హోమ్ కాలనీలో జరిగిన నాలా కబ్జాపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు కాంగ్రెస్ నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. 61వ డివిజన్ పరిధిలోని గ్రీన్ హోమ్ కాలనీలో ఉన్న ప్రధాన వరద నీటి కాలువను ఒక వెంచర్ యజమాని (వంగ హరిమోహన్ రెడ్డి) ఆక్రమించారు.
నిబంధనలకు విరుద్ధంగా నాలాపై 40 అడుగుల రోడ్డు నిర్మించినట్లు వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.నాలా ఆక్రమణ వల్ల పై ప్రాంతాల్లోని చెరువుల నుండి వచ్చే వరద నీరు వెళ్లే దారి లేక కాలనీని ముంచెత్తుతోంది. కాలనీ వాసులు తీవ్ర ఆస్తి నష్టాన్ని చవిచూడటమే కాకుండా, నెలల తరబడి మురుగు నీటిలోనే నరకయాతన అనుభవిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన మురుగు నీటి వల్ల కాలనీలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై సానుకూలంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి, ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.