2 June, 2026 | 9:42 PM

ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం ప్రకటించాలి: పల్లపు బుద్ధుడు

02-06-2026 08:51 PM

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విధివిధానాలను త్వరితగతిన ప్రకటించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడు, మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు పల్లపు బుద్ధుడు మంగళవారం కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గౌరవం, గుర్తింపు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఉద్యమకారుల సేవలను గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితర వర్గాలకు న్యాయం జరిగేలా కమిటీ పారదర్శకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ నెల 4న జరగనున్న కేశవరావు ప్రత్యేక  కమిటీ సమావేశంలో విధివిధానాలను ఖరారు చేసి, ఉద్యమకారులకు గుర్తింపు కల్పించే అంశంపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యమకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని పల్లపు బుద్ధుడు తెలిపారు.