సులానగర్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే(Yellandu constituency MLA) కోరం కనకయ్య సోమవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు, మందులు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక వైద్యాధికారి డా. కంచర్ల వెంకటేష్, సర్పంచ్ పూల్ బంతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






