ఎమ్మెల్యే హైదరాబాద్లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం
-నియోజకవర్గ సమస్యలపై బొల్లం ప్రశ్నల వర్షం
-పోలీసు ఖాళీలు, నిధుల వివక్షపై బొల్లం విమర్శలు
మోతె, జూలై 02(విజయక్రాంతి): ఎమ్మెల్యే హైదరాబాద్లో కాదు... నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానిక ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. మోతె మండలంలోని హుస్నాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు అద్దె వాహనాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ప్రజాప్రతినిధి నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం గడుపుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
కోదాడ నియోజకవర్గంలోని కోదాడ రూరల్ పోలీసు స్టేషన్లో సీఐ పోస్టు, అనంతగిరి, మునగాల పోలీసు స్టేషన్లలో ఉప నిరీక్షకుల పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయించి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందేలా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల గ్రామాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.
అనంతరం హుస్నాబాద్ గ్రామానికి చెందిన కొత్తూరు రవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షుడు హలావత్ మదార్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఆరే లింగారెడ్డి, గ్రామ సర్పంచ్ అక్కెనపల్లి శ్రీరాములు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






