14 July, 2026 | 3:42 AM

అంతర్జాతీయ సదస్సులో వక్తగా గీతం అధ్యాపకురాలు

14-07-2026 12:19 AM

గోవాలో జరిగిన ఐసీటీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్

పటాన్ చెరు, జులై 13 :హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్, గోవాలోని తాజ్ వివాంటాలో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన 11వ అంతర్జాతీయ ఐసీటీ సదస్సు, అవార్డుల ప్రదానోత్సవంలో గీతం తరఫున ఆహ్వానిత వక్తగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో స్మార్ట్, అనుసంధానిత, సుస్థిర పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరివర్తనాత్మక పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రొఫెసర్ పర్వేకర్ ఒక విశ్లేషణాత్మక ప్రసంగం చేసినట్టు తెలియజేశారు.

సాంకేతిక ఆవిష్కరణల ద్వారా వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఐవోటీకి పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ ప్రసంగంలో నొక్కి చెప్పారన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై చర్చించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, సహకార పరిశోధనలకు అవకాశాలను అన్వేషించడానికి ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఒక చోట చేర్చిందని తెలిపారు.

ఈ సదస్సుకు హాజరైన ప్రముఖులలో గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తొలి మహిళా అధ్యక్షరాలు ప్రతిమా గౌరీష్ ధోండ్; మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటీ) చైర్మన్, సలహాదారు, మెంటర్, అధ్యక్షుడు నితిన్ కుంకోలియంకర్; బెల్ గ్రేడ్ లోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, ఏఐ ప్రాజెక్టు అధిపతి ప్రొఫెసర్ మిలన్ టూబా తదితరులు ఉన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.