ఉచిత మెగా వైద్య శిబిరాలతో సేవలు
కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు అండగా భూక్య జంపన్న
హైదరాబాదులో విజయవంతంగా కంటి ఆపరేషన్లు పూర్తి
తాడ్వాయి,(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురిని ఎంపిక చేసి హైదరాబాద్కు తరలించి నిపుణుల వైద్యుల ద్వారా ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాక రోగులు తిరిగి తాడ్వాయికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జంపన్న మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 26విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా సుమారు 16వేల పైచిలుకు మందికి బీపీ,షుగర్, కంటి పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
అలాగే కంటి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలను గుర్తించి ఇప్పటివరకు 3,284పై చిలుకు మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేయించామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాలను కొనసాగిస్తూ కంటి చూపుతో ఇబ్బంది పడుతున్న పేదలకు నిరంతరం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జంపన్న తెలిపారు.




