గుడుంబా నిషేధంపై ధనియాలపాడు గ్రామపంచాయతీలో వెలిసిన ఫ్లెక్సీ
గుడుంబాపై ధనియాలపాడు పంచాయతీ కఠిన హెచ్చరిక
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలు పెరగడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ సనప సావిత్రి వెంకన్న అధ్యక్షతన సమావేశమై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి మాట్లాడుతూ... గుడుంబా వల్ల యువతతో పాటు చిన్నారులు కూడా వ్యసనానికి గురై ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపై గ్రామంలో ఎవరైనా సారాయి తయారు చేయడం, అమ్మడం, తాగడం చేస్తే ఎక్సైజ్ పోలీసులకు అప్పగించి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని, భారీ జరిమానాలు విధించి ఆస్తుల జప్తు వరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు గుడుంబాను పూర్తిగా నిరోధించేందుకు సహకరించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అందులో భాగంగా గ్రామస్తులకు అవగాహన కల్పించుట కొరకు పంచాయతీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు నాయక్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.






