9 June, 2026 | 3:50 AM

కురవిలో చేపల చెరువు లూటీ

09-06-2026 01:33 AM

పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మత్స్యకారులు

ఆర్థికంగా నష్టపోయామని వెల్లడి

పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో లక్షల రూపాయల విలువైన చేపలను లూటీ చేశారని మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృగశిర కార్తె ప్రారంభం రోజున వందలాదిమంది ప్రజలు చెరువులో చేపలు పట్టేందుకు తరలివచ్చారు.

చెరువులో నీళ్లు అధికంగా ఉండడం వల్ల చేపలను పూర్తిస్థాయిలో పట్టలేదని, ప్రజలు ముకుమ్మడిగా తరలివచ్చి తమ చేపలను వలల ద్వారా పట్టుకోవడం వల్ల తమ జీవనోపాధికి గండి పడిందని, లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోయినట్లు మత్స్య కారులు పోలీసులకు తెలిపారు.

ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు చెరువు కట్ట వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.మత్స్యకారులు పూర్తిగా చెరువులో చేపలను పట్టుకున్న తరువాతే ప్రజలు పట్టుకోవాలని, ఇలా ముందుగానే చేపలు పట్టుకోవడం సరైంది కాదని పోలీసులు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.